గత ఏడాది వచ్చిన ‘లైగర్’ తీవ్రంగా నిరుత్సాహపరచడంతో తాజా చిత్రం ‘ఖుషి’తో మంచి హిట్ను తన ఖాతాలో వేసుకోవాలనే తపనతో కనిపించారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. ఇటీవల సోషల్మీడియా ద్వారా ఫ్యాన్స్తో ముచ్చటించిన విజయ్ దేవరకొండ తన అభిమానులందరూ చాలా మంచోళ్లని, వారి కోసం హిట్ కొట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మ్యూజికల్ లవ్స్టోరీలో విజయ్ దేవరకొండతో సమంత జోడీ కట్టడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
తారాగణం: విజయ్ దేవరకొండ, సమంత, మురళీశర్మ, సచిన్ఖేడ్కర్, లక్ష్మీ, శరణ్య, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శరణ్య ప్రదీప్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జి.మురళి
సంగీతం: హేషమ్ అబ్దుల్ వాహెబ్
రచనా సహకారం: నరేష్ బాబు.పి
నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు: నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి
కథ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: శివ నిర్వాణ
గత ఏడాది వచ్చిన ‘లైగర్’ తీవ్రంగా నిరుత్సాహపరచడంతో తాజా చిత్రం ‘ఖుషి’తో మంచి హిట్ను తన ఖాతాలో వేసుకోవాలనే తపనతో కనిపించారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. ఇటీవల సోషల్మీడియా ద్వారా ఫ్యాన్స్తో ముచ్చటించిన విజయ్ దేవరకొండ తన అభిమానులందరూ చాలా మంచోళ్లని, వారి కోసం హిట్ కొట్టబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ మ్యూజికల్ లవ్స్టోరీలో విజయ్ దేవరకొండతో సమంత జోడీ కట్టడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. గత ఏడాది డిసెంబర్లోనే ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది..అయితే సమంత అనారోగ్య కారణాలతో దాదాపు ఎనిమిది నెలలు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా పాటలు అన్ని భాషల్లో పాపులర్ కావడం, ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయింది. గత కొంతకాలంగా కెరీర్పరంగా వరుస అపజయాలతో సతమతమవుతున్న విజయ్ దేవరకొండ, సమంతలకు ఈ సినిమా విజయం తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో ‘ఖుషి’ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఏ మేరకు అందుకుందో తెలుసుకుందాం..
కథ గురించి..
బీఎస్ఎన్ఎల్ సంస్థలో ఉద్యోగం సంపాదించిన విప్లవ్ (విజయ్ దేవరకొండ) తన పోస్టింగ్ను కశ్మీర్లో ఇవ్వాలని కోరతాడు. కశ్మీర్ అంటే మణిరత్నం సినిమాల్లో చూపించే అందమైన మంచుపర్వతాలు, వాటికి తోడుగా ఏ.ఆర్.రెహమాన్ మ్యూజిక్, అందమైన రొమాన్స్…అలా ఓ ఫాంటసీ ప్రపంచాన్ని ఊహించుకుంటాడు. అయితే అక్కడకు వెళ్లగానే ఓ బాంబ్బ్లాస్ట్ ఇన్సిడెంట్, భద్రతా దళాలు, తీవ్రవాదుల మధ్య కాల్పుల సంఘటనను ఫేస్ చేయడంతో భయానికి గురవుతాడు. కశ్మీర్లో జీవితం ఊహించినట్లుగా అంత అందంగా ఉండదని అర్థమవుతుంది. ఈ సందిగ్ధ పరిస్థితుల్లో అక్కడ ఆరాబేగం (సమంత) పరిచయమవుతుంది. తొలిచూపులోనే ఆమె ప్రేమలో పడతాడు విప్లవ్. తప్పిపోయిన తన సోదరుడి కోసం తాను పాకిస్థాన్ నుంచి వచ్చానని విప్లవ్కు అబద్ధం చెబుతుంది ఆరాబేగం. ఈ క్రమంలో వారు ప్రేమలో పడతారు. కొద్ది రోజుల తర్వాత ఆరాబేగం అసలు పేరు ఆరాధ్య అని, ఆమె కాకినాడకు చెందిన అమ్మాయి అని విప్లవ్కు తెలుస్తుంది. తాను ప్రముఖ ప్రవచనకర్త చదరంగం శ్రీనివాస రావు (మురళీశర్మ) కుమార్తెనని విప్లవ్తో చెబుతుంది ఆరాధ్య. మరోవైపు విప్లవ్ తండ్రి లెనిన్ సత్యం హైదరాబాద్లో నాస్తికవాద సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తుంటాడు. గతంలోనే చదరంగం శ్రీనివాసరావుకు, లెనిన్ సత్యం మధ్య సిద్ధాంతపరమైన విభేదాలుంటాయి. ఈ నేపథ్యంలో తన కుటుంబ అభీష్టానికి వ్యతిరేకంగా ఆరాధ్య..విప్లవ్ను పెళ్లాడుతుంది. ఇద్దరి జాతకం కుదరనందున వివాహంలో సమస్యలు వస్తాయని ఆరాధ్య తండ్రి చదరంగం శ్రీనివాస రావు హెచ్చరిస్తుంటావడు. ఈ నేపథ్యంలో ఈ జంట వైవాహిక జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగిందన్నది తెరపై చూడాల్సిందే..
కథా విశ్లేషణ
సనాతన ధర్మాన్ని ఆచరించే అమ్మాయి కుటుంబం, నాస్తిక వాదాన్ని నమ్మే అబ్బాయి తండ్రి..వీరిద్దరి మధ్య జరిగే ఓ సంఘర్షణ నేపథ్యంలో దర్శకుడు శివ నిర్వాణ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. జంట మధ్య వివాహానంతరం ఏర్పడే విభేదాలు, మనస్పర్థల నేపథ్యంలో గతంలో ఎన్నో ప్రేమకథా చిత్రాలొచ్చాయి. అయితే ఈ సినిమాలో సనాతన ధర్మం, నాస్తికత్వం అనే విరుద్ధ సిద్ధాంతాల నడుమ ఓ జంట ప్రయాణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. సున్నితమైన అంశాన్ని తీసుకొని అంతిమంగా బంధాలు, ప్రేమలు గొప్పవనే సందేశాన్ని అందించారు. కశ్మీర్ నేపథ్యంలో ఈ సినిమా ప్రథమార్థం ఆద్యంతం ఆహ్లాదభరితంగా, చక్కటి వినోదంతో సాగింది. చిన్న అబద్ధంతో మొదలైన విప్లవ్, ఆరాధ్య ప్రేమాయణాన్ని తెరపై అందంగా ఆవిష్కరించారు. ఆరాబేగం అలియాస్ ఆరాధ్య ప్రేమను గెలుచుకోవడానికి విప్లవ్ చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో వచ్చే సన్నివేశాలు హృద్యంగా ఉంటూ మంచి వినోదాన్ని పంచుతాయి. విజయ్ దేవరకొండ, వెన్నెల కిషోర్ మధ్య కామెడీ బాగా వర్కవుట్ అయింది.
ఇక సెకండాఫ్లో ఫ్యామిలీ ఎమోషన్స్పై కథ నడుస్తుంది. ఆరాధ్యకు సంతానం కలగాలంటే హోమం జరపాల్సిందేనని చదరంగం శ్రీనివాసరావు పట్టుబడటం, దానికి లెనిన్ సత్యం వ్యతిరేకించడంతో రెండు కుటుంబాల మధ్య సంఘర్షణతో ద్వితీయార్థం భావోద్వేగాలతో నడుస్తుంది. అయితే హోమం నేపథ్యంలో సాగే డ్రామాను సాగతీశారనే భావన కలుగుతుంది. శాస్ర్తాలు, సైన్స్ కంటే ప్రేమ, పెళ్లి బంధమే గొప్పదని ఇరు కుటుంబాలు రియలైజ్ కావడంతో కథ సుఖాంతమవుతుంది. కథాపరంగా పాయింట్ పాతదే అయినా దానిని తెరపైకి కన్విన్సింగ్గా తీసుకురావడంలో దర్శకుడు శివ నిర్వాణ సఫలీకృతుడయ్యాడు. ఈ సినిమాకు వినోదం పెద్ద బలంగా నిలిచింది. సెకండాఫ్లో ‘అర్జున్రెడ్డి’లోని సీన్స్ను గుర్తుచేస్తూ విజయ్ దేవరకొండ-రాహుల్ రామకృష్ణ మధ్య వచ్చే ఎపిసోడ్ చక్కటి కామెడీని పండించింది. ఇక పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. వాటిని తెరపై తీసుకొచ్చిన విధానం కూడా చాలా బాగుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్
విప్లవ్ పాత్రలో విజయ్ దేవరకొండ చక్కటి నటనను కనబరిచాడు. ప్రేమికుడిగా, భర్తగా రెండు భిన్న పార్శాలున్న పాత్రల్లో మెప్పించాడు. కథానాయిక సమంతకు ఈ తరహా పాత్రలు కొత్తేమీ కాదు. ఆరాధ్య పాత్రలో బరువైన భావోద్వేగాలను పలికిస్తూ ఆకట్టుకుంది. మురళీశర్మ, సచిన్ ఖేడ్కర్ కథలో కీలకంగా నిలిచారు. వారిద్దరి నటన బాగుంది. ఇక వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ తమదైన కామెడీ టైమింగ్, డైలాగ్స్తో మెప్పించారు. అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ఈ కథను మరో స్థాయికి తీసుకెళ్లింది. పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా కుదిరింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు సాగతీతగా అనిపించినా ఓవరాల్గా ఫీల్గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘ఖుషి’ ప్రేక్షకులను మెప్పిస్తుంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ సినిమా మంచి ఫలితాలను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రేటింగ్: 3/5